నాద బ్రహ్మోత్సవంలో ఆకట్టుకున్న నీహాల్ భక్తి సంగీతం
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం ప్రముఖ నేపథ్య గాయకుడు నీహాల్ భక్తి గానామృతం చేశారు. ఈ కార్యక్రమంలో నీహాల్ "మొగదాకిరి అనే గజల్ సంగీతంతో ఆరంభించి, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు అంటూ, వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని" అంటూ చక్కని అన్నమయ్య సంకీర్తనలతో ఆద్యంతం అలరించారు. వీరికి కీబోర్డు మీద రాజు గారు మరియు తబలా పై అజయ్ వాయిద్య సహకారం అందించారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖులు, గౌరవనీయులైన తెలంగాణ ఒలింపిక్ ప్రెసిడెంట్, మాజీ యూనియన్ మినిస్టర్ డా. ఎస్. వేణు గోపాల చారి గారు విచ్చేసి కళాకారుల సంగీతాన్ని ఆలకించి, "నీహాల్ సంగీతం చాలా బాగుంది., శోభారాజు గారి కృషి వలన ఎంతో మంది పిల్లలకు, పెద్దలకూ భక్తి, జ్ణానం, వికాసం బలపడ్డాయని," తమ విలువైన సందేశాన్ని అందించారు. అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ గారు, ఙ్ఞాపికను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగాయి.