తాలిబన్లతో స్నేహం దిశగా రష్యా అడుగులు...
ఆఫ్గనిస్తాన్ ను ఏలుతున్న ప్రస్తుత తాలిబన్లకు రష్యా సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తాలిబన్లను తొలగించాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వంతో ఆచరణాత్మక సత్సంబంధాలను కొనసాగించాలని డిసైడైంది. ఈ పరిణామం తాలిబన్ సర్కార్ కు నిజంగా గొప్ప ఉపశమనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకూ చైనా, యూఏఈ మాత్రమే తాలిబన్ రాయబార్లను అంగీకరించాయి. ఇప్పుడు ప్రపంచంలోనే ఓ అతిపెద్ద శక్తిమంతమైన దేశం సైతం .. తమ పాలనను గుర్తించడం.. వారికి ఓ విజయంగా చెప్పొచ్చు.
ఇప్పటివరకూ చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న తాలిబన్లు.. ఇప్పుడు రష్యాతోనూ వ్యాపార బంధాన్ని సాగించవచ్చు . అంతేకాదు... ఓదేశంగా రష్యాతో సంబంధాలు బలోపేతంచేసుకుంటూ.. దేశానికి కావాల్సిన సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే తాజా పరిణామాలను అగ్రదేశమైన అమెరికాతోపాటు యూరోప్ నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లోని భారతదేశం.. దీన్ని ఎలా చూస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తాలిబన్లను భారత్.. ఉగ్రవాదులగానే చూస్తోంది. వారి వల్ల కశ్మీర్ లో ఉగ్రవాదం పెరిగే ప్రమాదముందన్నది భారత్ భావనగా ఉంది.
2021 ఆగస్టులో యూఎస్ బలగాలు ఆఫ్గనిస్తాన్ ను వదిలి వెళ్లినప్పటి నుంచి తాలిబన్లు.. ఆదేశాన్ని ఆక్రమించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి వారు తమదైన పాలన సాగిస్తున్నారు. మహిళలపై ఆంక్షలను విధించారు. దీంతో మహిళలు ఉద్యోగాలు వదిలి, ఇళ్లకే పరిమితమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆదాయం తగ్గి, మరింతపేదరికంలోకి ఆఫ్గన్లు జారిపోయారు. ఈ పరిస్థితుల్లో చైనా,యూఏఈ మినహా ఏదేశం కూడా తాలిబన్ పాలనను గుర్తించడం లేదు. 2003లో తాలిబన్లను ఉగ్రవాద జాబితాలో చేర్చిన రష్యా.. అప్పటి నుంచి ఆదేశంతో సంబంధాలు నెరపడం లేదు. అయితే ఇటీవలి కాలంలో రష్యా వైఖరి మారుతోంది. నెమ్మదిగా తాలిబన్లతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.