Jagan Furniture: ఫర్నీచర్ తీసుకెళ్లండి మహాప్రభో అంటున్న జగన్..! ఏంటి సంగతి..!?
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగి నాలుగు నెలలు కావస్తోంది. అయినా ఎన్నికల మూడ్ మారినట్లు కనిపించట్లేదు. ఇప్పటికీ టీడీపీ (TDP), వైసీపీ (YCP) మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పడు వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం చేసిన తప్పులను టీడీపీ ఇప్పటికీ ఎత్తి చూపుతోంది. అలాగే అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ.. ఆ తప్పులను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలనే ఆలోచనలో ఉంది. అందుకే అధికారంలో ఉన్నప్పుడు క్యాంప్ ఆఫీస్ (camp office) కోసం సమకూర్చుకున్న ఫర్నిచర్ (furniture) ని వెంటనే తీసుకెళ్లిపోవాలని లేఖ రాసింది.
ఏపీలో 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్న సంగతి తెలిసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. తన నివాసంలోనే కొంత బాగాన్ని క్యాంప్ ఆఫీసుగా మార్చుకున్నారు. దానికోసం మౌలిక వసతులకోసం దాదాపు రూ.15 కోట్ల 65 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో రోడ్లు, డోర్లు, సోఫాలు, కుర్చీలు, ఆడియో విజువల్ సామాగ్రి, కంప్యూటర్లు, టీవీలు లాంటివి ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా తమ క్యాంప్ ఆఫీసులకోసం ఇలా మౌలిక సామాగ్రిని సమకూర్చుకోవడం సహజమే. ఇందులో ఎవర్నీ తప్పుబట్టాల్సిన పనిలేదు.
అయితే జగన్ ఓడిపోగానే ఫర్నిచర్ ను తిరిగి ఇవ్వకుండా అలాగే ఉంచుకున్నారంటూ టీడీపీ విమర్సించడం మొదలుపెట్టింది. ఫర్నిచర్ దొంగగా అభివర్ణించింది. టీడీపీ ఇలా అనడం వెనుక కారణం లేకపోలేదు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే అంతకుముందు స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ రావు పైన (Kodela Siva Prasad Rao) ఇలాంటి ఆరోపణలే చేసింది వైసీపీ. వాస్తవానికి ఆ ఫర్నిచర్ తీసుకెళ్లాలని కోడెల అప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. దాన్ని చెప్పకుండా వైసీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తట్టుకోలేక ఆత్మహత్య (suicide) చేసుకున్నారని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవే ఆరోపణలను జగన్ పై చేస్తోంది టీడీపీ.
టీడీపీ ఆరోపణల నుంచి బయటపడేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జగన్ ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకుంటున్నారనే ఆరోపణలు రాగానే.. వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి (Lella Appi Reddy) ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫర్నిచర్ లో కొంత భాగాన్ని తాము ఉంచుకుంటామని.. దాని విలువెంతో చెప్తే చెల్లిస్తామన్నారు. అలాగే కొంత ఫర్నిచర్ తిరిగిచ్చేస్తామన్నారు. నాలుగు నెలలలవుతున్నా జీఏడీ (GAD) నుంచి ఫర్నిచర్ స్వాధీనంపై ఇంకా రిప్లై రాలేదు. దీంతో లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మరో లేఖ రాశారు. ఇప్పటికే నాలుగు లేఖలు రాశామని.. అయినా జీఏడీ స్పందించలేదన్నారు. క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా (Party Office) మార్చుకుంటున్నందున తమకు ఫర్నిచర్ అడ్డంగా ఉందని.. వెంటనే దాన్ని తీసుకెళ్లాలని కోరారు. ఒకవేళ మీకు తీసుకెళ్లేందుకు వీలు లేకపోతే ఎక్కడికి తీసుకురావాలో చెప్తే తాము తీసుకొచ్చి ఇస్తామన్నారు. అంటే తమపై ఫర్నీచర్ దొంగ ఆరోపణలు రాకుండా చూసుకునేందుకు వైసీపీ పదే పదే లేఖలు రాస్తోంది. బహుశా నాటి కోడెల వ్వవహారం వైసీపీ నేతలకు గుర్తొస్తున్నట్టుంది.